సంసారం చేపల వల వంటిది.
ఎవరి మాయతో ఈ సంసారం సృజింపబడిందో ఆ భగవంతుడు జాలరి.
జాలరి వలలో చేపలు పడినప్పుడు కొన్ని వల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. అటువంటి వారిని “ముముక్షువులు” అంటారు.
అయితే అలా ప్రయత్నించిన అన్ని చేపలు తప్పించుకోలేవు. వాటిలో కొన్ని మాత్రమే వల నుంచి బయట పడతాయి. అలా బయటపడిన వారిని “ముక్తజీవులు” అంటారు.
కొన్ని చేపలు అప్రమత్తతతో ఉండి ఎప్పటికీ వలలో చిక్కుకోవు. వారిని “నిత్యముక్తులు” అంటారు.
ఎక్కువ చేపలు ఈ వలలో క్రీడిస్తూ తప్పించుకోవట్నికి కూడా ప్రయత్నం చెయ్యక వలలో సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. వారిని “బద్ధజీవులు” అంటారు అని పరమహంస రామకృష్ణలు చెప్పేవారు.
పరమహంసను ప్రత్యక్షంగా సేవించుకున్న శిష్యులు అదృష్టవంతులు. వారు భగవంతుని మానవ రూపంలో దర్శించి, సేవించి ఆత్మానందం అనుభవించారు. హిందు మతంలో వెలసిన అలసత్వాన్ని తరిమికొట్టి, హిందూ ప్రజలలో జాగృతిని తెచ్చిన వివేకానంద మొదలగువారు.
మనమా కాలములోలేమని బాధపడకుండా మనకోసమే అన్నట్లుగా “శ్రీ రామకృష్ణులను చూడకపోయినా వారి మీద విశ్వాసముంటే నీవు ధన్యుడవు..” అని చెప్పేవారు ఆ శిష్యులు.
(Blessed are those who have not seen me but have faith in me)
మనగురువులో ఆ గురు పరంపరను మనము చూసుకోవాలి. మన గురువు వ్యాసుడు, శంకరుల వంటి వారన్న నమ్మకం మనను ముందుకు నడిపిస్తుంది.
గురుమండల రూపిణి అయిన జగదంబ అండ లభిస్తుంది.
కాబట్టి పరమాత్మ మానవ రూపమైన గురువును సదా తలుచుకుంటూ శరణాగతి చెయ్యటమే మన తక్షణ కర్తవ్యం.
శరణాగతి అంటే దైవం వంటి గురుదేవుల శ్రీచరణాలకు సర్వం సమర్పించుకోవటం.
శరణాగతి వల్లనే ఏదో నాటికైనా మనం ముక్తజీవులము కాగలము.
కృష్ణపరమాత్మ కూడా గీతలో చెప్పిందిదే కదా….”సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।”
ప్రతి రోజూ, ప్రతిగంట, ప్రతి నిముషం పరమాత్మను మరువుక మననం చేసి మనము ముక్తజీవులమవుదాం.
గురుదేవ పారిమాం. గురుదేవ రక్షమాం.
శ్రీమాత కృప చేత గురువారం ఉదయం కలిగిన భావపరంపరలు…