ఈమధ్య వస్తున్న కొన్ని రచనలు చూసాక కొన్ని మౌలిక ప్రశ్నలు మనకు తప్పక ఉదయిస్తాయి.
అసలు కథకు, నవలకు తేడా ఏంటి?అని.
ఎందుకు అసలు నవల కానీ, కథ కానీ రాస్తారు ఈ రచయితలు?
ఏదైనా ఎలాగైనా రాయవచ్చా? అన్న ప్రశ్న మనలను తికమక పెడుతుంది ఈ రచనలు చదివితే.
దానికి కారణం చాలా మటుకు తలా తోక లేకుండా ఉండే కథనంతో, నవల అనే పేరు పెట్టి ఈ సాంఘిక మాధ్యమాలలో వస్తున్న రచనలు.
ఇవి చదివితే ఎటు వెడుతోందో సాహిత్యం – అని సందేహం కలుగుతుంది.
కథ, నవల అన్నవి రెండు వేరు వేరు సాహిత్య ప్రక్రియలు.
కథకు కానీ నవలకు కాని కొన్ని మౌలిక లక్షణాలు వుంటాయి.
ప్రస్తుతం ఇలా నవల, కథ అన్న పేరుతో రచనలు చేస్తున్నవారు తమ రచనలను బేరీజు వేసుకోవల్సిన అవసరము ఎంతైనా వున్నది.
కథ – నవల అంటే ఏమిటి? వాటికి రెంటికీ వున్న తేడాలు ఏమిటి అన్నది పరిశీలించాలి.
కథ అంటే చిన్నగా, సూటిగా విషయాన్నీ స్పష్టంగా చెప్పటం.
అదే విషయము నవలలో విఫులంగా విస్తారంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే – ఒక సంఘటన గురించి చెబితే కథ, కొన్ని సంఘటనల సమాహారం నవల అనవచ్చు.
కథ అంటే సంభాషించుట, చెప్పుట అనే అర్ధాలున్నాయి. కథని ఆంగ్లంలో “Short Story” అని అంటారు.
కథలో విషయం ఒక్కటే ఉంటుంది. ఒక సంఘటనకు మాత్రమే సంబంధించి వుంటుంది.
కథనం సూటిగా ఉంటుంది. వర్ణనలు తక్కువగా వుంటాయి. లేదా కొన్ని సార్లు అసలు ఉండవు. కథ ఎత్తుగడ, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రలు, ఆపాత్రలకు తగు పోషణ, వస్తువిన్యాస వైశిష్ట్యము, ఒక జీవిత సత్యమును ప్రతిపాదిస్తూ సూటిగా ఉంటుంది.
ఠావులు, పేరాల సంఖ్య తక్కువగా ఉంటాయి.
విషయాల మీద చర్చ ఎక్కువగా ఉండవు, లేదా అసలు చర్చ ఉండదు.
కథలో శిల్పం, కథా గమనం, విషయం వివరణకు విస్తారమైన సమయము ఉండదు.
అందులో వివరించేందుకు అంత సమయము కూడా ఉండదు కథా రచయితకి.
వ్రాసినది చాలా కుదించి రాయవలసి ఉంటుంది కాబట్టి, నిడివి తక్కువైనా విషయం సూటిగా ఉండాలి.
నాలుగు ఐదు పేజీల కన్నా ఎక్కువ ఉండదు . అందుకని విషయంలోకి డైరెక్టుగా వెళ్ళిపోతారు రచయితలు.
కొన్ని పెద్ద కథలు కూడా వున్నాయనుకోండి, వాటిని పెద్ద కథ అనే అంటారు.
కథ చదవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.
పాఠకునికి కలిగే భావాల పరంపరలు అప్పటికప్పుడు ఉద్భవించి అంతమౌతాయి.
ఆనందమైనా, సస్పెన్సు అయినా,దుఃఖమైనా ఆ రసానందం కలిగించటం రచయితకు ఒక పెద్ద సవాలు కథలో.
కథతో రచయిత చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పేసి, ఆపేస్తారు.
ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి.
కథ నుంచి రచయిత అందించే వివరాలు చాలా లిమిటెడుగా ఉంటాయి. అదే కథా రచయితకు ఉన్న సవాలు కూడా. వస్తు వైశాల్యం తక్కువగా వుండటము.
అదే విషయము మూలంగా (నిడివి తక్కువగా వుండటము మూలంగా) నేటి వేగవంతమైన జీవనవిధానంలో కథ చాలా మన్ననలు అందుకొంటున్నది.
ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటి కన్నా కథకి ఆదరణ ఎక్కువగా ఉంది .
అందుకే నేటి సాహిత్యం ప్రక్రియలలో రారాజుగా ఏలుతున్నది అన్నది అక్షర సత్యం.
కథలు సాంఘిక దురాచారాలను ఎండగట్టాయి. స్వతంత్రం గురించి వివరించాయి. కుటుంబాలలో సరదాలను, సమస్యలను వివరించాయి. సమాజంలో సహేతువైన మార్పుకు కథ తనవంతు పాత్ర నిర్వహించింది.
బండారు అచ్చమాంబ గారి “దంపతుల ప్రళయ కలహం” అన్నది మొట్టమొదటి కథ అని ఈ మధ్యనే పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు.
మనకు తెలిసినంతవరకూ అంటే ఇంతవరకు చరిత్రలో మొదటి కథ గురజాడ అప్పారావు గారి “దిద్దుబాటు“.
తెలుగు కథలకు అంతర్జాతీయ పేరు తెచ్చిన ఘనత పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన‘ కు ఉన్నది.
తెలుగు కథల మీద, ‘వందేళ్ళ తెలుగు కథ‘ పేరుతో చాల పుస్తకాలూ నేడు మనకు బజారులో లభ్యమౌతున్నాయి.
**********************
నవల :
ఆంగ్లంలో ఉన్న ‘నావల్ ‘ అనే పదం ఆధారంగా నవల అనే పేరు వచ్చింది. తెలుగు పదాలు అజంతా పదాలు. అచ్చుతో అంతంమవుతాయి, కాబట్టి నావెల్ అనే పదం నవలగా రూపాంతం చెందింది. నవల అన్నది జీవిత వాస్తవికతను, సంక్లిష్టతను, సంఘర్షణను చిత్రించే విస్తృతమైన సృజనాత్మక ఒక గొప్ప ప్రక్రియ .
నవలను మొట్టమొదటి సారి నిర్వచించిన వారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు. ఆయన నవలకు చెప్పిన నిర్వచనం “నవీన విశేషాలు కలిగిన గద్య ప్రక్రియ నవల” .
‘ఆంధ్రా నవల పరిణామం’ అన్న పరిశోధన గ్రంధం రాసిన బోడపాటి కుటుంబరావు గారు ‘రచనకాలం లో వచ్చిన వాస్తవాలు ఆచారాలు చిత్రీకరించేది నవల” అని చెప్పారు.
సాంఘిక జీవన ప్రతిబింబంగా వ్యక్తుల జీవన గమనాన్ని చిత్రీకరిస్తూ జనుల ఆచార – వ్యవహారాలను చిత్రీకరించే గద్య ప్రబంధం నవల” అని మొగలి నాగభూషణ శర్మ ‘నవల వికాసం’ అన్న గ్రంధంలో పేర్కొనటం జరిగింది.
నవలకు వుండ వలసిన ముఖ్యమైన విషాయాలు నాలుగు. అవి1.కథ 2. కథావస్తువు 3. పాత్రలు 4. నేపథ్యం ఈ నాలుగు విషయాలు ఉండాలి నవలకి. నవల ఏదైనా విషయాన్ని విస్తారంగా వివరిస్తుంది. కథా వస్తువును 360 డిగ్రీలలో చూడటం, వివరించటం జరుగుతుంది. సులభమైన శైలిలో వివరించటం నవలలో ఉన్న మరో లక్షణం. అనేక సంఘటనలతో కూడి వున్న సమాహారము నవల.
వస్తువు – ఆవిష్కరించటానికి, చర్చించటానికి, వివరణకు విస్తారంగా అనేక సంఘటనల సహాయముతో చర్చించ బడుతుంది.
శైలిలో స్పష్టత కనపడుతుంది. శిల్పం చెక్కిన తీరులో హృద్యంగా ఉంటుంది. నవరసాలు వివిధ సన్నివేశాలతో కూడి ఉంటాయి. కథా కధనంలో ఔచిత్యం చూపించటానికి రచయితకు చాలా వెసులుబాటు ఉంటుంది నవలలో.
నవలలో పాత్రలు స్వభావ స్వరూపాలు నిడివిని విస్తారంగా వర్ణించటానికి కావలసిన సమయం ఉంటుంది.
వివిధ వర్ణనలు, నవరసాలతో నిండి చదువరులకు సంపూర్ణ ఆనందం కల్గిస్తుంది.
అందుకే రస వివరణలతో కూడిన నవల కొన్ని వందల పేజీలు నిండుతుంది.
కథనంలో బిగితో, మలుపులతో రచయిత తనను తానూ నిరూపించుకునే అవకాశం పుష్కలంగా ఇస్తుంది.
నవలలో సమాజం ప్రతిబింబిస్తుంది.నవల సాంఘిక సామాజిక జీవితం, మత సిద్ధాంతాలను, ప్రజల నమ్మకాలను చూపిస్తుంది.
నవల ద్వారా రచయిత సమాజానికి హితువు బోధించవచ్చు. సంతోషం అందించవచ్చు. నవరసాల పోషణ చెయ్యవచ్చు. మార్పును కోరవచ్చు, సూచించవచ్చు.
పాత్రలు నిడివి మీద కూడా రచయితకు కావలసినంత సౌలభ్యం కూడా ఉంటుంది. మీదు మిక్కిలి కొంత సమాజపు హితవు ఉంటుంది. ఒక సమస్యను చర్చిస్తూ ఉన్నప్పుడు, పరిష్కారం కూడా రచయిత సూచించటం జరుగుతుంది. వీటిని ఎంతో సవివరముగా సహేతుకంగా అందించవచ్చు రచయిత.
అందుకే నవల సమాజపు హితవు కూడా అందిస్తుంది అంటారు.అలా సమాజంలోని కుళ్ళును ఎత్తి చూపించి మార్పును అభ్యుదయాన్ని కోరిన, సూచించిన నవలులు వున్నాయి తెలుగులో. నవల పాఠకులకు రసానుభూతి ఇస్తుంది, కాబట్టి నవలను ‘గద్య కావ్యం’ అన్నారు.
తెలుగు సాహిత్యం పద్యం నుంచి గద్యం కి వచ్చినప్పుడు,శ్రీరంగరాజ చరిత్ర మొదటి నవల అని చెబుతారు. కానీ కందుకూరి వీరేశలింగం గారి ‘రాజశేఖర చరిత్ర‘ తో నవల తెలుగు సాహిత్యంలో (1875) ప్రవేశించింది. దీనికి వివేకా చంద్రిక అని కూడా పేరు. ఇది ఆంగ్లంలు నుంచి తెలుగు లోనికి అనువాదం. ఆంగ్లం నుంచి గోల్డ్ స్మిత్ రచించిన ‘వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్‘ అన్న నవల. మరల దీన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. పరిపూర్ణమైన నవలగా ఇది చరిత్రలో స్థిరపడినది.
నేటి వరకూ తెలుగు నవలలు ఎన్నో వచ్చాయి. సాంఘిక దురాచారాల మీద సమరశంఖం పూరించింది నవల.
బడుగు వర్గాల వారి జీవితాన్ని తెలుగు సాహిత్యంలో చెదిరిపోని చిత్రం గీసింది నవల. మధ్య తరగతి జీవితాన్ని యదధాతధంగా చిత్రించి ప్రపంచానికి చూపించింది.
అన్ని దశలను విశదీకరించింది నవల. తెలుగులో వచ్చిన మర్చిపోలేని నవలలు ఎన్నో. అవ్వన్నీ నేటి మార్కెట్ లో లభ్యమౌతున్నాయి.
అవ్వన్నీ ప్రతీ ఒక్కరూ చదవ వలసిన నవలలు.
రచనలు చెయ్యటానికి ముందు అధ్యయనం, అభ్యాసం తప్పని సరి అని విజ్ఞులు చెబుతారు.
పరిపుష్టియైన నవలా సాహిత్యం మన తెలుగులో లభ్య మవటం మన అదృష్టం. అలాంటి నవలను చదివి, ఆకళింపుచేసుకొని, తరువాత రచనలు చేస్తే, అప్పుడు ఆ రచన అర్థవంతంగా ఉండి పాఠకులకు రసానందం అందిస్తుంది. అలాంటి నవల పది కాలాలు నిలుస్తుందనటంలో ఏలాంటి సందేహం లేదు.