బదిరి చరిత్ర వివరములు:
కేదార ఖండములో, నర నారాయణ పర్వతాల మధ్య, వెలసిన తపోభూమి బదరి. ఆ క్షేత్రానికి ‘నారద క్షేత్రం’ మంటారు. అంటే నారదులవారు అక్కడ ఆరు నెలలు వుండి స్వయంగా నారాయణ సేవ చేయుకుంటారుట.
‘నరనారాయణ’ పర్వతాలకు వున్న చరిత్ర:
పూర్వం సహస్ర కవచుడన్న రాక్షసుడు బ్రహ్మ వరమున ప్రజలను పీడిస్తున్న నారాయణుడు ఆ అందమైన క్షేత్రాన మొట్టమొదట కాలు పెట్టాడు. ఆయన మొదట కాలు పెట్టిన చోటును ‘చరణపాదు’కలంటారు. అక్కడ పాద ముద్రలు వుంటాయి. అక్కడ నారాయణుడు తన నుంచి వెలుపడిన నరునకు నారాయణ మంత్రం ఉపదేశించాడు. వారిరువురు ఒకరు సహస్ర కవచునితో యుద్దం చేస్తున్న రోజున మరొకరు తపమొనర్చారుట. అలా 999 కవచాలు ఊడాయి. అప్పుడు సహస్ర కవచుడు భయంతో శరణమేడాడు. నారాయణుడు సహస్ర కవచునకు మరు జన్మలో సహజ కవచముతో జన్మించమని, కానీ నరుని చేతులోనే మరణం కలదని వరమొసంగాడుట. ఆ వర ప్రభావమున ఆ అసురుడు కర్ణునిగా జన్మించి అర్జునుని చేత మరణించాడని పురాణ గాథ.
ఆ నర నారాయణ పర్వతాలను మనం చూడవచ్చు. ఆ రెండు అందమైన పర్వతాల మధ్య వున్న లోయలో బదిరి వున్నది.
కోవెలలో నరనారాయణ విగ్రహాలు పూజలందుకుంటూ కూడా చూడవచ్చు.
కేదార ఖండమున నారాయణుడు వెలసిన తీరు:
అందమైన ఆ బదిరికా వనము ఈశ్వరుడు పార్వతితో కలసి క్రీడించు వనము. సౌందర్యము ఓలలాడుతూ వుండే ఆ వనము పై నారాయణునికి ప్రీతి కలిగినది. ఆయన బాలుని వేషమున శివ పార్వతుల కళ్ళబడి, పార్వతి వద్ద ఆ ప్రాంతము వరముగా పొందాడు.
ఆ ప్రాంతములో జపతపాదులకు అంత విలువెందుకంటే నారాయణుడు అక్కడ స్వయంగా తపస్సు చేశాడు కాబట్టి.
కోవెలలో ఆయన పద్మాసనములో జపం చేస్తూ వుండే ఆ సాలిగ్రామము మనలను అమితాశర్యమును, ఆనందమును కలిగిస్తుంది. మనము ఉదయము అభిషేకమునకు కనుక వెళ్ళగలిగితే నిజరూప దర్శనము, అచ్చటి అర్చకులు సర్వం వివరిస్తూ చూపెడతారు.
సత్యయుగ కాలమునాటిదని చెప్పే ఆ నారాయణ విగ్రహము మధ్యలో కొంతకాలము భౌదులు బుద్దునిదని కొలవటం, కాదని వాదించిన వారిని పడగొట్టి సాలిగ్రామాన్ని అలకనందలో పడవేసి వెళ్ళిపోవటం జరిగింది.
క్రీ. పూర్వపు (500-400) శతాబ్దానికి చెందిన శంకరభగవత్పాదుల వారు అక్కడ తపమొనర్చునప్పుడు నారాయణుడు ఆయనకు తన ఉనికిని చెప్పి బయటకు తీసి ప్రతిష్టింపమని ఆదేశిస్తాడు. శంకరాచార్యువారు నారదకుండమున (అలకనందను ఆ ప్రాంతమున నారద కుండమంటారు. నీరు మంచులా చల్లగా వుండి మనం తాకితే కొంకర్లు తిరుగుతాము) వెతికి ఆ సాలిగ్రామమును తీసి పునఃప్రతిష్టాంచారు. కేరళ నంబూద్రిలు మాత్రమే సేవ చెయ్యాలని నిర్దేశించారు.
అక్కడి రావల్జీకి (అర్చకులకు) చాలా నియమాలు వున్నాయి. వారు బ్రహ్మచర్య వ్రతమాచరించాలి. ఆరు నెలలు ఎచ్చటికి వెళ్ళరాదు. గుడి, వారి గృహము తప్ప అన్య ప్రదేశములు వారు వెళ్ళరు. ఆ బ్రహ్మచారి తప్ప అన్యులు నారాయణ విగ్రహాన్ని తాకరాదు. ఇత్యాదివి.
నేటి మనము చూస్తున్న గుడిని అచ్చటి దర్వాడ రాజులు కట్టినది.
హిమాలయ యోగులెందరికో బదిరికావనము నిత్యనివాసము. ఆ యోగులు సూక్ష్మ రూపమున ఇప్పటికి యోగ తపము చేస్తూ అన్యులకు కనపడక వుంటారు. వారి కృపకోరి తపించు నరమానవులకు మాత్రమే వారి దర్శనము లభిస్తుంది.
మహావతారు బాబాజీ క్రియ యోగ గురువులు. వారి ఆశ్రమము బదిరికి ఆవల వుందని చెబుతారు.
పూజ్య శ్రీ కుర్తాళం స్వామి వారు కూడా చాలా సార్లు హిమాలయాలలో వున్న సిద్దాశ్రమం గురించి చెప్పి వున్నారు.
మనకర్దం కాని ఆధ్యాత్మికతలో పరాకాష్ఠకు చెందిన రహస్యాలు బదిరికావనములోనే నిక్షిప్తమై వున్నాయి. అందుకే బదిరి అంత పవిత్రంగా ఒప్పాడుతుంది.
ఆరు నెలలు దేవతలచే కొలవపడు ఆ క్షేత్రం దీపావళి రోజున మూసివేస్తారు. ఆ మూసి వేసేముందు వెలిగించిన దీపం తిరిగి ఎఫ్రెల్ లో తలుపులు తీసినప్పపడు కూడా వెలుగుతూనే వుండటం అచ్చటి మరో వింత.
ఆ జ్యోతి దర్శనము కోరి భక్తులు వేలలో దర్శిస్తారు.
బదిరి ని దర్శించిన వారు ముందు అక్కడి ఊష్ణ గుండములో శుద్ది పొంది, ఆది కేదారశివుని దర్శించి నారాయణుని దర్శిస్తారు. అప్పుడే యాత్రాఫలము లభ్యమని చెబుతారు.
చుట్టూ మంచులా చల్లటి వాతావరణములో కూడా ఉష్ణ గుండములో నీరు వెచ్చగా వుండి సెగలు క్రక్కడం మరో వింత.
బదిరినాథు యాత్ర సామాన్యంగా మనవారు మే, జూన్, జులై లలో వెడతారు. ఆగష్టు లో యాత్రలు వుండవు. ఎడతెరని వానల వలన హిమాలయాలలో రహదారులు మూసుకుపోయి బాగు పరచలేని విధంగా వుంటాయి. వరసగా రెండు రోజులు వాన పడితే బదిరి కీ జ్యోషిమఠం కి మధ్య దారి మూసుకుపోతుంది.
తిరిగి సెప్టెంబరులో యాత్ర పునః ప్రారంభమవుతుంది.
చలి వచ్చెయ్యటం వలన మన వాళ్ళు సెప్టెంబరు సమయంలో యాత్రకు రారని నాకు అక్కడి వారు చెప్పారు.
నేను ఈ సెప్టెంబరులోనే బదిరికి వెళ్ళగలిగాను.




